Bank robbery | నెన్నెల, సెప్టెంబర్ 1: బ్యాంకు చోరీకి వచ్చిన ఓ దొంగ.. ‘ఇది గుడ్ బ్యాంక్.. ఒక్క రూపాయి కూడా దొరకలేదు.. నన్ను పట్టుకోవద్దు’ అంటూ న్యూస్ పేపర్పై రాసి వెళ్లాడు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గురువారం రాత్రి ఓ దొంగ చోరీకి విఫలయత్నం చేశాడు.
శుక్రవారం ఉదయం స్వీపర్ బ్యాంకులో పనిచేసేందుకు రాగా తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి మేనేజర్ వెంకటేశ్వర్రెడ్డికి సమాచారం ఇచ్చాడు. మేనేజర్ వచ్చి చూసి దొంగలు పడ్డారని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు పక్కనున్న ప్రహరీలోకి దూకి బ్యాంకు మెయిన్ డోర్ తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి, మొదట క్యాషియర్, ఆ తర్వాత మేనేజర్ క్యాబిన్లోకి వెళ్లి డ్రాలను తెరిచినట్టు పోలీసులు గుర్తించారు.
లాకర్ గదిలోకి వెళ్లే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తున్నది. మేనేజర్ టేబుల్పై ఉన్న న్యూస్ పేపర్పై ‘నా ఫింగర్ ప్రింట్ కూడా దొరకదు.. ఇది గుడ్ బ్యాంకు. ఒక్క రూపాయి కూడా దొరకలేదు. నన్ను పట్టుకోవద్దు’ అని మార్కర్తో రాసి వెళ్లాడు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి సీసీ కెమెరాల్లో కనిపించకుండా చేతులకు గ్లౌసులు, నిండా ముసుగు ధరించి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. క్లూస్ టీం ద్వారా ఫింగర్ఫ్రింట్స్ పరిశీలిస్తున్నామని ఎస్సై శ్యాంపటేల్ తెలిపారు.