హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ నేతృత్వంలో ఇంజినీర్ల బృందం అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిని సోమవారం సందర్శించింది. నది వెంట వరద నివారణకు నిర్మించిన కరకట్టలను, ఇతర నిర్మాణాలను బృందం పరిశీలించింది. ఆయా నిర్మాణాల ఫలితాలను, ఇతర ప్రభావాలను అస్సాం ఇంజినీరింగ్ అధికారుల ద్వారా తెలుసుకున్నది. గోదావరి నది వరద ముంపు నివారణకు ఇరువైపులా కరకట్టలు నిర్మించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మేరకు అధ్యయనానికి ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
మహానది, బ్రహ్మపుత్రసహా ఇతర నదులపై వరద రక్షణ చర్యలను అధ్యయనం చేయాలని ఆ కమిటీ సూచించింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆ కమిటీ ఇప్పటికే ఒడిశా రాష్ట్రంలోని మహానది వెంట నిర్మించిన కరకట్టలను పరిశీలించి వచ్చింది. తాజాగా బ్రహ్మపుత్ర నదిని సోమవారం పరిశీలించింది. కార్యక్రమంలో నిపుణుల కమిటీ సభ్యులైన సాగునీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఓఅండ్ఎం విభాగం ఈఎన్సీ నాగేంద్రరావు, హైడ్రాలజీ సీఈ రమేశ్, సీఈలు చంద్రశేఖర్, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ రామరాజు, ఎస్ఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.