హైదరాబాద్, జనవరి3 (నమస్తే తెలంగాణ): గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరమే తెలంగాణ ప్రాజెక్టులు మోడికుంట, గూడెం ఎత్తిపోతలకు అనుమతులు ఇచ్చామని వివరించింది. చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం మంగళవారం జలసౌధలో కొనసాగింది. ప్రధానంగా మోడికుంట, గూడెం ఎత్తిపోతల పథకాల డీపీఆర్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ డీపీఆర్లపై తమ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తమ సమ్మతి లేకుండానే అనుమతులు మంజూరు చేశారని చెప్పారు. ఏపీ వాదనలపై తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఘాటుగా స్పందించారు. గోదావరిలో ఏపీ ప్రాజెక్టులన్నీ బేసిన్ 7 నుంచి 11లోని నీటి లభ్యత ఆధారంగా చేపట్టినవేనని స్పష్టం చేశారు. మోడికుంట, గూడెం బేసిన్ 5లో ఉన్నాయని, అందువల్ల ఏపీ ప్రాజెక్టులకు ఎలాంటి నీటి కొరత ఉండబోదని చెప్పారు. ఆ రెండు ప్రాజెక్టులకు వెంటనే ఆమోదం తెలుపాలని ఏపీని, బోర్డును కోరారు. తుదకు ఏపీ అభిప్రాయాలతో ఆ ప్రాజెక్టుల డీపీఆర్లను సీడబ్ల్యూసీకి పంపాలని బోర్డు నిర్ణయించింది.
సీడ్మనీతో ఏం చేస్తారో చెప్పండి
పెద్దవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ చేపట్టేందుకు బోర్డు ఇప్పటికే రూ.78 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. ఆ ప్రతిపాదనలపై ఇరు రాష్ర్టాలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. 50ః50 నిష్పత్తిలో నిధులను భరించి ప్రాజెక్టు ఆధునికీకరణకు ఏపీ సర్కారు ఆమోదం తెలుపగా తెలంగాణ వ్యతిరేకించింది. మోడ్రనైజేషన్ నిధులను నీటిని వినియోగించుకుంటున్న నిష్పత్తిలోనే ఏపీ, తెలంగాణ మధ్య 85:15 నిష్పత్తిలో భరించాలని స్పష్టం చేసింది. అందుకు ఏపీ సమ్మతిస్తేనే తాము మోడ్రనైజేషన్కు సమ్మతిస్తామని ఖరాకండిగా తేల్చిచెప్పింది. ఇదిలా ఉండగా రివర్ బోర్డుల గెజిట్ ప్రకారం ఇరు రాష్ర్టాలు ఒక్కో బోర్డు నిర్వహణకు రూ.200 కోట్ల చొప్పున సీడ్మనీ ఇవ్వాల్సి ఉన్న విషయం తెలిసిందే. తాజా బోర్డు సమావేశంలో దానిపై చర్చించారు. అయితే సీడ్మనీ ఏం చేస్తారో పూర్తి వివరాలను అందజేయాలని, ఆ తరువాతనే తమ రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించి, ఆ తరువాత సీడ్మనీ ఇస్తామని ఇరు రాష్ర్టాలు వెల్లడించాయి.
నీటి లభ్యతపై అధ్యయనానికి ఏపీ ప్రతిపాదన
గోదావరిలో నీటిలభ్యతపై మరోసారి సమగ్ర అధ్యయనం చేయాలని ఏపీ ప్రతిపాదించింది. ఇందుకు తమకు అభ్యంతరం లేదని రజత్కుమార్ స్పష్టంచేశారు. సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం డైరెక్టర్ నిత్యానందరాయ్ విభేదించారు. పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టుల సమయంలోనే గోదావరిలో నీటిలభ్యతపై సమగ్రంగా అధ్యయనం చేశామని, 2021 వరకు కూడా ఇరు రాష్ర్టాలకు కలిపి ట్రిబ్యునల్ కేటాయించిన 1430 నుం చి 1489 టీఎంసీల లభ్యత మాత్రమే ఉం దని, అంతకుమించి లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు కొత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరమే లేదని తేల్చిపారేశారు.