Minister Harish Rao | హరీశ్ రావు.. ఈ పేరు తెలియని వారు ఉండరు. పైగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యతలు చూసే కీలక మంత్రి. ఆయన ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కంకణబద్ధులై పనిచేస్తూనే., ఎప్పటికప్పుడు ఆరోగ్య జాగ్రత్తలు చెబుతూ ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. ప్లాస్టిక్ వాడకం వల్ల భయంకరమైన క్యాన్సర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయని ప్రజలను జాగృతం చేస్తున్నారు. పని ఒత్తిడి, నిరంతర ప్రజాహిత కార్యక్రమాలు, సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలలో బిజీబిజీగా భాగస్వామ్యయ్యే క్రమంలో వందలాది కిలో మీటర్ల ప్రయాణం వల్ల గొంతెండుతుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే మార్గం లేక ఆరోగ్య అమాత్యులు కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ద్వారా దప్పిక తీర్చుకునే అత్యవసర పరిస్థితి ఏర్పడుతున్నది.
దీన్ని గుర్తించిన ఒక వీరాభిమాని ఆవేదన చెందుతూ ఓ లేఖ రాశాడు. అమాత్యుడు హరీశ్ రావు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలని నేరుగా మంత్రికే ఒక లేఖ అందించారు. అందులో ఆరోగ్య హెచ్చరికలను ప్రేమతో సూచించారు. మీ ఆరోగ్యమే మాకు మహా భాగ్యమని, మీరు తప్పని పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారని, ప్లాస్టిక్ బాటిల్ నీరు తాగడం వల్ల శరీరంలో లివర్, చెస్ట్ క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని, ఇటీవల అంతర్జాతీయ ప్రముఖ రేడియాలాజిస్ట్ డాక్టర్. విమల్ సోమేశ్వర్ ఇంటర్వ్యూలో వెల్లడించారని చెప్పుకొచ్చారు.
దయచేసి మీరు ఇక నుంచి కాపర్ వాటర్ బాటిల్ వినియోగించాలని కాగితంపై రాసి శుక్రవారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పర్యటనలో మంత్రి హరీశ్ రావుకు బల్వంతపూర్ రోడ్డు వైపు ఉన్న డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద అందించాడు. ఈ మేరకు తన అభ్యర్థనను తప్పకుండా స్వీకరిస్తానని సార్ చెప్పారని దుబ్బాక మున్సిపాలిటీ 1వ వార్డు మల్లాయపల్లికి చెందిన ప్రవీణ్ అనే విద్యార్థి తెలిపాడు. ప్రస్తుతం ఇందూరు కళాశాలలో ఎంబీఏ చదువుతున్న ప్రవీణ్ ఆరోగ్య మంత్రి హరీశ్ మనస్సు గెలిచారని నెటిజన్లలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.