చివ్వెంల, మార్చి 16 : సంపు గోడ కూలి ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల శివారులో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల (నాగారానికి చెందిన పాఠశాల)లో గురువారం జరిగింది. ఐదోతరగతి చదువుతున్న విద్యార్థులు మోతె మండలం అప్పన్నగూడేనికి చెందిన రావుట్ల పవన్ (11), మద్దిరాల మండలం చందుపట్లకు చెందిన సుశాంత్, శాలిగౌరారం మండలం ఎస్ లింగోటానికి చెందిన కే యశ్వంత్ సాయంత్రం స్నానం చేసేందుకు సంపు వద్దకు వెళ్లారు. నల్లాలు తిప్పుతుండగా ఒక్కసారిగా సంపు గోడ కూలింది. తీవ్రగాయాల పాలైన విద్యార్థులను వెంటనే సూర్యాపేట జనరల్ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ పవన్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్రెడ్డి, కలెక్టర్ ఎస్ వెంకట్రావ్ బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు.
పవన్ కుటుంబానికి రూ.2 లక్షల పరిహా రం ఇవ్వనున్నట్టు మంత్రి జగదీశ్రెడ్డి తెలిపా రు. బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగంతోపాటు డబుల్ బెడ్రూం ఇల్లు, మృతుడి సోదరుడికి గురుకులంలో విద్యావకాశం కల్పిస్తామన్నారు. గాయపడిన విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.