నేరడిగొండ, ఏప్రిల్ 8: గుండెపోటుతో తల్లి మృతిచెందడంతో పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు ఓ విద్యార్థి. ఈ సంఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వాంకిడి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎస్కే ఫజల్ పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు.
శనివారం అతడి తల్లి ఆజ్మీరా బేగం గుండెపోటుతో మృతి చెందింది. ఇంట్లో మృతదేహం ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో గణితం పరీక్ష రాశాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ కేంద్రానికి వచ్చిన ఫజల్ను అతడి స్నేహితులు ఓదార్చి ధైర్యం చెప్పారు.