బంజారాహిల్స్, ఏప్రిల్ 16 : హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నం 14లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం సమీపంలో క్షుద్రపూజలు అంటూ ఓ వార్త కలకలం సృష్టించింది. కేసీఆర్ ఇంటికి సమీపంలోని ఖాళీ ప్లాట్లో మంగళవారం మధ్యాహ్నం ముగ్గు మధ్యలో ఒక బొమ్మకు పసుపు కుంకుమ చల్లి ఎర్రటి వస్త్రంలో నిమ్మకాయలు, మిరపకాయలు ఇతర సామగ్రిని గుర్తించి స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
ఈ విషయం నందినగర్ బస్తీలో వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి కొంతమంది యువకులు ఖాళీ స్థలంలో కనిపించారని స్థానికులు తెలిపారు. ఇది ఎవరైనా అకతాయిల పని కావొచ్చని మరికొందరు చెప్పారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తూ విచారణ చేస్తున్నారు.