హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ టీహబ్కు చెందిన ‘వాట్ ఈజ్ మై గోల్’ అనే స్టార్టప్ ఇటీవల మాక్ ఎలక్షన్స్ నిర్వహించింది. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై అవగాహన కల్పించేందుకు, 18 ఏండ్లలోపు విద్యార్థులకు దేశ ఎన్నికల విధానం, ఓటుకు దరఖాస్తు, ఓటు హక్కు వినియోగం, పరిపాలన, ఎమ్మెల్యే అభ్యర్థిత్వం వంటి అంశాలపై మాక్ ఎలక్షన్స్ నిర్వహించింది. రాష్ట్రంలోని వందకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి లక్షకు పైగా అండర్-18 విద్యార్థులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘అండర్-18 స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఇన్ పాలిటిక్స్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 105 నియోజకవర్గాల్లో ఈ మాక్ ఎన్నికలు నిర్వహించింది. ముందుగా 10 నియోజకవర్గాల్లోని ఎన్నికల ఫలితాలను ఆ సంస్థ విడుదల చేసింది.
సుస్థిర జీవనంపైనే దృష్టి సారించిన గ్రీన్ పార్టీ అభ్యర్థులు ఐదు సీట్లు కైవసం చేసుకున్నారు. ఫ్యూచర్ పార్టీకి మూడు సీట్లు, పీపుల్స్ పార్టీకి రెండు సీట్ల చొప్పున వచ్చాయి. మిగతా నియోజకవర్గాల ఫలితాలను విడుదల చేశాక ఈ నెల 29న గచ్చిబౌలిలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహిస్తామని ‘వాట్ ఈజ్ మై గోల్’ స్టార్టప్ నిర్వాహకులు తెలిపారు. ఈ ఎన్నికలకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా చిత్రలీ శర్మ వ్యవహరించారు. కింగ్, సన్నీ, క్రిష్, మమత, శ్రీనివాస్, వనజ, అలేఖ్య, అఖిల బృందం ఈ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించింది. గెలుపొందిన వారికి ఎన్నికల సంఘం, వై-20 సర్టిఫికెట్లు ఇప్పిస్తామని వాట్ ఈజ్ మై గోల్ ఫౌండర్ కింగ్ తెలిపారు. విద్యార్థి దశ నుంచే ఓటు హక్కు, ఎన్నికల విధానంపై అవగాహన కల్పించడం అభినందనీయమని రాష్ట్ర సీఈవో వికాస్రాజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ఎన్నికల సంఘం నుంచి సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు.