హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబరు 28 (నమస్తే తెలంగాణ): ఆయా రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి, ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీలో ఏకంగా ఒక బృందమే ఉన్నట్టు తెలుస్తున్నది. ‘ఆపరేషన్ ఆకర్ష్’ ఈ బృందం ప్రధాన పని అని, బీజేపీలో నంబర్-టూ గా వెలుగొందుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్షా కనుసన్నల్లో ఈ బృందం పనిచేస్తున్నదని సమాచారం. ఇప్పటికి ఎనిమిది రాష్ర్టాల్లో ఎనిమిది ప్రభుత్వాలను కూల్చడం వెనుక ఈ బృందమే కీలకంగా వ్యవహరించిందని చెప్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఈ బృందం తొలుత క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేస్తుంది. ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించడం, వారిని ప్రలోభపెట్టడం లేదా భయపెట్టడం దాని వ్యవహారం. ఆ తరువాత ఢిల్లీ పెద్దలు స్వయంగా రంగంలోకి దిగుతారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కొన్నిసార్లు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండానే నడిపిస్తారని తెలుస్తున్నది.
కొన్నిరోజుల పాటు సంప్రదింపులు
తాము ఎర వేయాలని ఎంచుకున్న ఎమ్మెల్యేల విషయంలో స్పష్టత వచ్చిన తరువాత మధ్యవర్తులు రంగంలోకి దిగుతారు. వారు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న క్రమంలో స్వామీజీలు ఫోనులో తెరపైకి వస్తారు. ‘బీజేపీలో చేరితే ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి లాభాలు ఉంటాయో వివరిస్తారు. ఎమ్మెల్యేలకు నమ్మకం కలిగించేందుకు ఢిల్లీ పెద్దల పేర్లను ప్రస్తావిస్తారు. అవసరమైతే వారి ముందే ఢిల్లీ పెద్దలతోగానీ, లేదా వారి సహాయకులతో గానీ మాట్లాడుతారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నారని సూచనలు అందితే ఇక వారికి భారీ ఎత్తున డబ్బు ముట్టచెప్తామంటూ ప్రలోభ పెడ్తారు. ఎమ్మెల్యే స్థాయి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, తాజా పరిస్థితుల ఆధారంగా వంద కోట్ల రూపాయల వరకు ఆఫర్ ఇస్తారని అంచనా.
రంగంలోకి ఢిల్లీ పెద్దలు
క్యాషాయ గ్యాంగ్ తమ పనిని విజయవంతంగా పూర్తిచేసిన తరువాత ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగుతారని తెలిసింది. ఎమ్మెల్యే డిమాండ్లు.. ప్యాకేజీ నిర్ధారణ అయిన తర్వాత ఈ బృందం ఢిల్లీ పెద్దలను లైన్లోకి తీసుకుంటుంది. వారి ద్వారా ఎమ్మెల్యేలకు పదవులు, సూట్కేసుల అంశాలపై హామీ ఇప్పిస్తారు. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యేలు పార్టీలోకి ఎప్పుడు రావాలి? వచ్చే ముందు చేయాల్సిన పనులు ఏమిటి? తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీపై అసంతృప్తిని ఎలా వ్యక్తం చేయాలి? పార్టీ లేదా ప్రభుత్వాధినేతను ఎలా బద్నాం చేయాలి? తదితర విషయాలన్నింటిపై ఢిల్లీ నుంచి స్క్రిప్టు వస్తుంది.
కండువాలు సిద్ధం చేయాలంటూ సమాచారం
క్యాషాయ గ్యాంగ్ చాలాసార్లు తమ వ్యవహారాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండానే చక్కబెడతుందని తెలిసింది. డీల్ కుదిరిన తర్వాత కాషాయ తీర్థం పుచ్చుకునే ఇతర పార్టీ ఎమ్మెల్యేల ప్రకటనలు, వారి వ్యవహారశైలి ఆధారంగా ‘ఓహో.. ఆపరేషన్ ఆకర్ష్ పూర్తయింది’ అని తాము అర్థం చేసుకోవాల్సి ఉంటుందని బీజేపీ నేత ఒకరు చెప్పారు. ఇందుకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఉదంతాన్ని ఉదహరించారు. హస్తినలో రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు డీల్ పూర్తయిన తర్వాత హస్తిన సంకేతాల ఆధారంగానే కోమటిరెడ్డి ఎపిసోడ్ నడిచిందని తెలిపారు. ఇదంతా తాము కోమటిరెడ్డి మాటలు, చేతల ఆధారంగా అర్థం చేసుకున్నామని, ఆయన రాజీనామా చేసిన తర్వాతగానీ తమకు సంపూర్ణంగా స్పష్టత రాలేదని చెప్పారు. ఇలా అంతా చక్కబెట్టిన తర్వాత చేరిక ముహూర్తాన్ని ఖరారు చేసి… కండువాలు సిద్ధం చేసుకోవాలనే తమకు ఆదేశాలు వస్తాయని సదరు బీజేపీ నేత పూసగుచ్చినట్టు వివరించారు.
వివిధ వేషధారణల్లో సభ్యులు
ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు బీజేపీ ఏర్పాటుచేసిన బృందంలో 20 మం ది సభ్యులున్నట్టు తెలుస్తున్నది. వీరిలో ఎక్కువమంది స్వామీజీల రూపంలో ఉం డగా, కొందరు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్టు సమాచారం. ఏదైనా రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేయాలని ఢిల్లీ పెద్దల నుంచి సంకేతాలు రాగానే ఈ బృందం రంగంలోకి దిగుతుంది. ఢిల్లీ పెద్దలతో టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిణామాలను తెలియపరుస్తూ తమ పనిని కొనసాగిస్తుంటారు. ముందుగా బృందంలోని స్వామీజీలు ఆ రాష్ట్రంలోని ప్రముఖులతో టచ్లోకి వస్తా రు. యాగాలు, పూజల పేరుతో వారితో సాన్నిహిత్యం పెంచుకుంటారు. ఈ క్రమంలోనే ఆయా రాజకీయ పార్టీలతో సన్నిహితంగా ఉండే వ్యక్తులను గుర్తిస్తారు. వీరిని తమకు మధ్యవర్తులుగా నియమించుకుంటారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో నందకుమార్ ఇందుకు ఉదాహరణ. వీరి ద్వారా తాము ఎర వేయదలచుకున్న ఎమ్మెల్యేలను సంప్రదిస్తారు.