హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావుకు సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీబీఐ అధికారినంటూ పలువురిని మోసగించిన కేసులో విశాఖపట్నానికి చెందిన కొవ్విరెడ్డి శ్రీనివాసరావును గత శనివారం సీబీఐ అధికారులు ఢిల్లీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం ఢిల్లీ రౌస్ అవెన్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు శ్రీనివాసరావును హాజరు పరిచారు. న్యాయమూర్తి దీపక్కుమార్ ధర్మాసనం కేసును విచారించింది.
శ్రీనివాసరావు నకిలీ అధికారిగా ఎందుకు మారాల్సివచ్చిందో తెలుసుకునేందుకు మరికొంత సమయం కావాలని సీబీఐ కోర్టును కోరింది. శ్రీనివాసరావుతో ఉన్న సంబంధాలపై సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సాక్షుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశామని, 1,100 కాల్ రికార్డులను పరిశీలించామని పేర్కొన్నది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులను మోసం చేస్తూ భారీ కుట్రకు పాల్పడ్డాడని, సీబీఐ జాయింట్ డైరెక్టర్గా చెప్పుకున్నాడని వివరించారు. నాలుగు రోజుల్లో ఆరుగురు సాక్షులను విచారించినట్టు, సాక్షుల్లో హైదరాబాద్కు చెందిన వ్యక్తులు ఉన్నట్టు ధర్మాసనానికి సీబీఐ తెలిపింది.
కొవ్విరెడ్డి విచారణకు సహకరించడం లేదని, విచారణ కోసం మరికొంత సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మరికొంతమంది సాక్షులను విచారించాల్సి ఉన్నందున పోలీస్ కస్టడీని పొడిగించాలని కోరారు. అయితే.. తనపై తప్పు మోపేందుకు అవసరమైన ఆధారాల సృష్టికి సీబీఐ ప్రయత్నిస్తున్నదని, ఐదురోజులుగా కస్టడీలో ఉంచి సీబీఐ ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయిందని శ్రీనివాసరావు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కస్టడీ పేరుతో శ్రీనివాసరావును సీబీఐ వేధిస్తున్నదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. శ్రీనివాసరావు పోలీస్ కస్టడీని పొడిగించేందుకు నిరాకరించింది. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ, ఆయనను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.