రామారెడ్డి, డిసెంబర్ 25: పంచాయతీ ఎన్నికల్లో ఓడిన ఓ అభ్యర్థి దూషణలు భరించలేక వార్డు ప్రజలు.. ఆమె పంచిన చీరలు, మద్యం సీసాలు, కూల్డ్రింక్స్ తిరిగి వాపస్ ఇచ్చారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. ఉప్పల్వాయిలో మొదటి విడతలో జరిగిన ఎన్నికల్లో రెండో వార్డు నుంచి పోటీ చేసిన ఓ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సదరు అభ్యర్థి పోలింగ్కు ముందు తన వార్డులో ఇంటింటికీ చీరలు, మద్యం బాటిళ్లు, కూల్డ్రింక్స్, కారా బూంది ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఎన్నికల్లో సదరు అభ్యర్థి ఓడిపోవడంతో వార్డు ప్రజలు కనిపించినప్పుడల్లా వారిని అసభ్యపదజాలంతో దుర్భాషలాడుతుండటంతో స్థానికులు విసిగిపోయారు. గ్రామపెద్దలతోపాటు వార్డు ప్రజలు ఓడిపోయిన అభ్యర్థిని గురువారం పంచాయతీ ఆవరణకు పిలిపించారు.
‘నీ తిట్లు వద్దు..నీ వస్తువులు మాకొద్దు’ అంటూ ఎన్నికల్లో ఆమె పంపిణీ చేసిన చీరలు, బీరు బాటిళ్లు, కల్లు ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్ను తీసుకువచ్చి పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుపై ఉంచారు. వాటిని తీసుకొని వెళ్లాలని ఓడిపోయిన అభ్యర్థికి సూచించగా ఈ క్రమంలో అక్కడ వాగ్వాదం చోటుచేసుకున్నది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని అభ్యర్థితోపాటు స్థానికులను సముదాయించారు.