కాల్వశ్రీరాంపూర్, జూలై 9: పిల్లలను ఇంటి నుంచి క్షేమంగా స్కూల్కు తీసుకెళ్లాల్సిన ప్రైవేట్ స్కూల్ మినీ వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపి చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాటిన ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పెగడపల్లి సన్షైన్ పాఠశాలకు చెందిన స్కూల్ మినీ వ్యాన్ గురువారం ఉదయం మంగపేట నుంచి 40 మంది విద్యార్థులతో పెగడపల్లిలోని స్కూల్కు వెళ్తున్నది.
డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో మంగపేట శివారులో ఎల్లమ్మగుడి సమీపంలో వ్యాన్ అదుపు తప్పింది. పక్కనే ఉన్న సిమెంట్ గద్దెను ఢీకొట్టి, ఆ తర్వాత అదే వేగంతో వెళ్లి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. స్తంభం విరుగకపోవడంతో వాహనం ఆగి ప్రమాదం తప్పింది.