హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): విప్రహిత బ్రాహ్మణ సదనం పథకం కింద తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభానికి సిద్ధమైంది. 6.10 గుంటల స్థలంలో రూ.10 కోట్లతో దీన్ని నిర్మించారు. ఇందులో బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 12 నిర్మాణాలను చేశారు. మూడంతస్తుల ఆడిటోరియం(ఫంక్షన్ హాలు), సమాచార కేంద్రం, మఠాధిపతులు, పీఠాధిపతుల విడిది సదనం మొదలైనవి ఇందులో ప్రధానమైనవి. రూ.10 కోట్ల అంచనాతో నిర్మాణం చేపట్టగా, ఇప్పటివరకు రూ.9.43 కోట్లు దీనికోసం ఖర్చు చేశారు.
కులమతాలకు తావులేకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పేదరికంలో ఉంటూ నిరాదరణకు గురైన బ్రాహ్మణ సమాజాన్ని ఉద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ ఏర్పడిన అనంతరం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఏర్పాటుచేసి వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.100 కోట్లు కేటాయించింది. అవసరాలకు అనుగుణంగా ఏటా ప్రభుత్వం బడ్జెట్లో కూడా నిధులను కేటాయిస్తున్నది. ఈ క్రమంలోనే బ్రాహ్మణ సమాజం విస్తృత ప్రయోజనాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి గోపన్పల్లిలో భూమిని కేటాయించడంతోపాటు నిధులు మంజూరు చేశారు. 2017 జూన్ 5న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కే తారక రామారావు చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. ప్రస్తుతం ఈ సదనం నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
విప్రహిత బ్రాహ్మణ సదనం పథకం
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సమాజం కోసం విప్రహిత బ్రాహ్మణ సదనం పథకాన్ని అమలు చేస్తున్నది. సాంస్కృతిక, సంప్రదాయక, సామాజిక, వైదిక పరమైన, బ్రాహ్మణ సమాజ హిత కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఉద్దేశించిన ఈ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 75 శాతం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ భరిస్తుంది. మిగిలింది దాతలు, లేక స్థానిక బ్రాహ్మణ సమాజం ద్వారా సమకూర్చుకుంటారు.
మరికొన్ని చోట్ల బ్రాహ్మణ సదనాలు….