హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): చాలా అరుదుగా కనిపించే ఆంత్రోపొమార్ఫిక్ శిల్పం యాదాద్రి భువనగరి జిల్లా, భువనగిరి మండలం కేసారంలో కనిపించింది. గ్రామం బయట దారి వెంట ఉన్న ఈ స్మారక రాతి శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేశ్ గుర్తించారు. ఇది అస్పష్టమైన శరీర భాగాలతో ఉన్న మానవరూప (అలైంగిక) స్మారకశిల (మెన్హిర్). గుండ్రని తల, దీర్ఘచతురస్రాకారపు ఛాతిభాగం, భుజాలు, కిందికి నడుము భాగం పోల్చుకునే విధంగా చెకిన స్మారకశిల నేలలో లోతుకు పాతినట్టుంది. తెలంగాణలో పాత వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మానవరూప స్మారకశిలలు లభించాయి. ఇప్పటికీ ఇలాంటి సమాధులు, స్మారకశిలలను నిలిపే ఆచారాలు గోండులు, గదబలు, కురుబలు, ముండాలు, నాగులు, సవరలు వంటి కొన్ని గిరిజన సమూహాల్లో ఉన్నాయి. ఖమ్మం జిల్లా తొట్టిగుట్టలో స్థానిక ప్రజలు వీటిని దేవతలుగా ఆరాధిస్తున్నారు. గతంలో జనగామ జిల్లా కొడకండ్ల గ్రామంలో బయ్యన్నగా పూజిస్తున్న ఇలాంటి స్మారక శిలారూపాన్ని ప్రస్తుత టార్చ్ ప్రధాన కార్యదర్శి అరవింద్ ఆర్య, చారిత్రక పరిశోధకుడు ఆర్ రత్నాకర్రెడ్డి గతంలో గుర్తించారు.