బాలానగర్, డిసెంబర్ 25 : నాలుగు వందల రూపాయల గొడవ ఓ వ్యక్తి నిండు ప్రాణం తీసింది. కూలీ డబ్బులు తక్కువ ఇచ్చారనే కోపంతో ఉన్న ఓ వ్యక్తి మరో వ్యక్తిని కంటెయినర్ చక్రాల కిందికి తోసేసి హత్య చేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటుచేసుకొన్నది. ఇన్స్పెక్టర్ కే భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం ఎల్కతల గ్రామానికి చెందిన బిల్లిపురం శ్రీనివాస్ (35) బాలానగర్లో కూలి పనులు చేసుకొంటూ స్థానిక చౌరస్తా ఫుట్పాత్పై నిద్రిస్తూ బతుకీడుస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా పిట్లం మండలానికి చెందిన బుగుడాల కాశీరాం (46) ఫతేనగర్ డివిజన్ పరిధిలోని దీన్దయాల్నగర్లో నివాసం ఉంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్, కాశీరాం, జోగి శాంతకుమార్తోపాటు మరికొందరు బాలానగర్లోని ఓ ఫ్యాన్ కంపెనీలో పనికి వెళ్లారు. పని ముగిశాక శ్రీనివాస్ తన తోటి కూలీలకు డబ్బులిచ్చాడు. రూ.400 తక్కువ వచ్చాయని కాశీరాం.. శ్రీనివాస్తో గొడవపడ్డాడు. ఇంతటితో ఆగక శ్రీనివాస్ను చంపాలని కాశీరాం కుట్రపన్నాడు. కాశీరాం పీకలదాకా మద్యం తాగి ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు బాలానగర్ చౌరస్తాకు వచ్చి ఫుట్పాత్పై నిద్రిస్తున్న శ్రీనివాస్ను కర్రతో కొట్టాడు. శ్రీనివాస్ తేరుకోవడంతో ఇద్దరూ కొట్టుకొన్నారు. అదే సమయంలో సనత్నగర్ వైపు వెళ్తున్న లారీ వెనక టైర్ల కిందకు శ్రీనివాస్ను కాశీరాం తోసివేశాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, గాంధీ దవాఖానకు తరలించారు. నిందితుడిని అరెస్టు చేశారు.