సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 18: ఓ హత్య కేసులో దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఖైదీలకు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కృషితో విముక్తి లభించింది. హత్యకు గురైన కుటుంబానికి నిందితుల తరఫున 2013లోనే కేటీఆర్ రూ.15 లక్షల పరిహారాన్ని అందజేసి దుబాయ్ ఎంబసీ అధికారులతో చర్చలు జరిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం (48), శివరాత్రి రవి (45) అన్నదమ్ములతోపాటు కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్ (48), చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి (48), జగిత్యాల జిల్లా మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు (51) 2004లో ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లారు.
ఈ క్రమంలో ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉన్న నేపాల్కు చెందిన దిల్బహదూర్ 2005లో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో వారిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు 25 ఏండ్ల జైలు శిక్ష విధించింది. దుబాయ్ చట్టాల ప్రకారం.. హత్యకు గురైన నేపాల్కు చెందిన సెక్యూరిటీ గార్డు దిల్బహదూర్ కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించడంతోపాటు బాధిత కుటుంబం క్షమాభిక్ష పెడితే కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించి ఆయనే స్వయంగా నేపాల్కు వెళ్లి రూ.15 లక్షలు దిల్బహదూర్ భార్యకు అందజేసి క్షమాభిక్షకు మార్గం సుగమం చేశారు. ఆమె సంతకం చేసిన పత్రాలను కోర్టులో సమర్పించడంతో దుబాయ్ కోర్టు క్షమాభిక్షకు అంగీకరించింది. నెల కిందట కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్ విడుదలయ్యాడు. మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు శనివారం స్వదేశానికి వచ్చాడు. పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి రెండు రోజుల కిందట విడుదల కాగా.. ఈ నెల 21న స్వదేశానికి రానున్నారు.