హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్కాలనీలో సకల సదుపాయాలతో అధునాతనంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టుకు ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఉత్తమ పౌర సదుపాయాలున్న పర్యాటక కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును సొంతం చేసుకున్నది. మంగళవారం హైదరాబాద్లోని హైటెక్స్లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవంలో అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్ సందీప్కుమార్ సుల్తానియా బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టీఎస్టీడీసీ చైర్మన్ భూపతిరెడ్డి, ఎండీ మనోహర్, బుద్ధవనం అధికారులు సుధీర్రెడ్డి, బాబు, శ్యాంసుందర్రావు తదితరులు పాల్గొన్నారు.