NIN | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ‘గర్భవతి బలహీనత, ఆమె గర్భస్థ శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పుట్టినప్పటి నుంచి ఐదేండ్ల వరకు ఎదుగుదల లోపించే అవకాశం ఉంది. గర్భిణి అధిక రక్తహీనతతో బాధపడుతుంటే పుట్టబోయే బిడ్డ బరువు నిర్దిష్ట ప్రమాణాల కంటే తక్కువగా ఉంటుంది’ అని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) తెలిపింది. తెలుగు రాష్ర్టాల్లో ఈ ప్రభావం 33 శాతం మేర ఉన్నట్టు తమ అధ్యయనంలో తేలిందని పేర్కొంది. మొత్తం 10,350 మంది చిన్నారుల బరువు, ఎత్తును పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలిపింది. బాలికలు, మహిళల్లో రక్తహీనత అత్యంత ప్రమాదకారిగా మారుతున్నది.
ఎన్ఐఎన్ పరిశీలనలో 33 శాతం మంది వయస్సుకు తగినంత ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేరని తేలింది. ఈ సమస్య పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే పిల్లల్లోనూ ఉన్నట్టు వెల్లడైంది. పోషకాహార లోపం కారణంగా చిన్నారులు బరువు పెరగడం లేదని గుర్తించారు. శారీరక ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందకపోవడంతో వారిని ఊబకాయం కూడా వేధిస్తున్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. మెజార్టీ పిల్లల రక్తంలో ఐరన్ లోపం ఉందని తేల్చారు. దీనంతటికి కారణం వారు గర్భంలో సమయంలో వారి తల్లి రక్తహీనత కారణమని తేల్చారు.
పట్టణాలు, నగరాల్లో నివసించే చిన్నారుల్లోనూ రక్తహీనత పెరగడం ఆందోళన కలిగించే విషయమని ఎన్ఐఎన్ పరిశోధకులు పేర్కొన్నారు. తాము 10,350 మంది చిన్నారుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించగా.. పట్టణాల్లోనే 33.8 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు.