హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): కర్నూలు జిల్లాలో పొలం పనులకు వెళ్లిన కూలీ పంట పండింది. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన వ్యక్తి పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని రూ.10 లక్షల విలువ చేసే బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి కొనుగోలు చేసినట్టు తెలిసింది. కర్నూలు జిల్లాలో మూడు రోజులుగా వానలు పడటంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది.
జిల్లాతో పాటూ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా జనాలు వజ్రాల కోసం గాలిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి, ఎర్రగుడి, ఉప్పరపల్లి, పగిడిరాయితో పాటు మరికొన్ని చోట్ల వజ్రాల కోసం వేట సాగిస్తున్నారు. మద్దికెర మండలంలో బసినేపల్లి, పెరవళి, మడనంతాపురంలలో వజ్రాలు ఉంటాయని స్థానికుల నమ్మకం.