Peddapally | పెద్దపల్లి : బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసి మరో ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. పెద్దపల్లి జిల్లాకేంద్రానికి చెందిన వైద్యుల రమేశ్ (45) ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనాన్ని కొనసాగించేవాడు. ఆయనకు భార్య గాయత్రి, ఇద్దరు కూతుర్లు వైష్ణవి, శర్వాణి. రమేశ్ గత నెల 25న ఇంట్లో కాలుజారి పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతను అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు బ్రెయిన్డెడ్గా నిర్ధారించారు.
విషయం తెలుసుకున్న జీవన్ దాన్ అవయదాన కేంద్రం సభ్యులు అక్కడి వెళ్లి రమేశ్ భార్య, కూతుర్లకు అవయదానానికి ఒప్పించారు. దీంతో రమేశ్ శరీరం నుంచి కండ్లు, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి శస్త్ర చికిత్స ద్వారా అమర్చినట్టు జీవన్ దాన్ ఇన్చార్జ్ స్వర్ణలత తెలిపారు. ఈ మేరకు జీవన్దాన్ అవయదాన కేంద్రం తరుపున శనివారం పెద్దపల్లిలో రమేశ్ కుటుంబ సభ్యులకు అవదాన సర్టిఫికేట్ అందజేసి శాలువాతో సన్మానించారు.