హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): బీజేపీలో కొత్త లొల్లి మొదలైంది. బీజేపీ, దాని అనుబంధ యువజన విభాగం బీజేవైఎం మధ్య వైరం ముదిరింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కూడా టికెట్లు ఇవ్వాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో సహాయ నిరాకరణ తప్పదని హెచ్చరించినట్టు సమాచారం.
గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో సోషల్మీడియా సభ్యులతో సమావేశం జరిగింది. దీనికి బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీసూర్య హాజరయ్యారు. ఆయనతోపాటు ఎంపీ కే లక్ష్మణ్, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం నేతలు మాట్లాడుతూ.. ధర్నాలు, రాస్తారోకోలు, కొట్లాటల్లో పాల్గొని అరెస్టులు, కేసులు ఎదుర్కొన్నామని, తమకు టికెట్లు ఎందుకు ఇవ్వరని తేజస్వీసూర్య ముందే నిలదీసినట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ కోసం ఇన్నేండ్లుగా తాము పడుతున్న కష్టం వృథా అయినట్టేనా? అని ప్రశ్నించినట్టు తెలిసింది.