యాదగిరిగుట్ట, మార్చి 15 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొనేందుకు కొండపైకి వెళ్లే భక్తులకు నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా లండన్ నుంచి విడి భాగాలను దిగుమతి చేసుకోగా అవి గుట్టకు చేరుకున్నాయి. ప్రధానాలయంలో మూలవిరాట్ దర్శనం ప్రారంభమైన అనంతరం గుట్టకు రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఇందుకోసం కొండపైకి వెళ్లే వాహనదారులకు రెండు ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టగా ఇప్పటికే ఎగ్జిట్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. దాదాపు రూ.69 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నెట్వర్క్ బ్రిడ్జి పనులు చివరిదశకు చేరుకున్నాయి. కొండపైకి వెళ్లే ఎంట్రీ ఫ్లైఓవర్ నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జిని జూన్లోగా అందుబాటులోకి వస్తుందని ఆర్అండ్బీ అధికారులు తెలిపారు.
కొండపైకి వెళ్లేందుకు కొండ కింద వైకుంఠ ద్వారం సమీపంలో గల ఆర్యవైశ్య సత్రం నుంచి 12 మీటర్ల వెడల్పు, 445 మీటర్ల పొడవుతో మొదటి ఘాట్రోడ్డు పాత నిత్యాన్నదాన భవనం వరకు ఫ్లైఓవర్ను అనుసంధానం చేయనున్నారు. ఇందులో 64 మీటర్ల పొడవులో ఆర్చ్ బ్రిడ్జి రానున్నది. కాగా ఈ ఫ్లై ఓవర్ కోసం 7 పిల్లర్లు, 32 మీటర్ల మేర నిర్మాణాలు సాగుతుండగా వాటికి సంబంధించిన స్పాన్ పనులు పూర్తయ్యాయి. ఇక లండన్ నుంచి దిగుమతి చేసిన నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జిని బిగించనున్నారు. ఇప్పటికే దాదాపు 85 శాతం పూర్తికాగా మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. ఎంట్రీ ఫ్లైఓవర్ అందుబాటులోకి రాగానే ఎగ్జిట్ ఫ్లైఓవర్ను కొండకిందికి వచ్చేందుకే వినియోగించనున్నారు.