హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తొలుత బ్రిడ్జి కోర్సుతో ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. నెల వ్యవధి గల ఈ కోర్సును పూర్తిచేసి, ఆ తర్వాతే రెగ్యులర్ పాఠ్యాంశాలను ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. గతంలో విద్యార్థి తెలుగు మీడియంలో చదివిన పాఠ్యాంశాల్లోని ముఖ్యమైన అంశాలపై తొలుత అవగాహన కల్పించి, ఆ తర్వాత రెగ్యులర్ పాఠ్యాంశాలు బోధించాలన్న నిర్ణయానికి వచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభం కానున్నది. జూన్ 13 నుంచి బడులు మొదలవుతాయి. జూలై రెండో వారం వరకు బ్రిడ్జి కోర్సును నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. బ్రిడ్జి కోర్సుపై ఎన్సీఈఆర్టీ అధికారులు ఓ డ్రాఫ్ట్ను రూపొందిస్తున్నారు. ఇందుకు నిపుణులు, టీచర్ల నుంచి నుంచి అభిప్రాయాలు సేకరించారు.
81 వేల టీచర్లకు శిక్షణపూర్తి
ఇంగ్లిష్ మీడియం అమల్లో భాగంగా మూడు అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకొన్నారు. వాటిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, ద్విభాషా పుస్తకాలు ముద్రించడం, డిజిటల్ మెటీరియల్ను తయారుచేయడం ఉన్నాయి. ద్విభాషా పుస్తకాలు ముద్రణ దశలో ఉన్నాయి. డిజిటల్ మెటీరియల్ సిద్ధమైంది. కీలకమైన టీచర్ల శిక్షణ సైతం పూర్తయ్యింది. 30 రోజుల్లోనే 81 వేల టీచర్లకు ఎన్సీఈఆర్టీ అధికారులు శిక్షణ ఇచ్చారు. సబ్జెక్టు టీచర్లకు అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ రూపొందించిన ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సులో శిక్షణనిచ్చారు. ఈ కోర్సును టీచర్ల కోసమే రూపొందించగా, మొత్తం ఐదు విడతల్లో శిక్షణ పూర్తిచేశారు.