హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు సజావుగా సాగాయి. అసెంబ్లీ ప్రారంభమైన వెం టనే ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావుకు సంతాపం తెలిపారు. మంత్రులు సోమవారం మొత్తం ఏడు బిల్లులను ప్రవేశపెట్టారు. వీటిలో జీఎస్టీ అ మెండ్మెంట్ బిల్లు, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా టర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్లు, జీహెచ్ఎంసీ అండ్ తెలంగాణ మున్సిపల్ యాక్ట్ సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రెగ్యులేషన్ అండ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యూయేషన్ అమెండ్మెంట్ యాక్ట్, అటవీ విశ్వవిద్యాలయం ఏర్పా టు బిల్లు, రాష్ట్ర వర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కోసం తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటుకు బిల్లు, మోటర్ వెహికల్స్ టాక్సేషన్ అమెండ్మెంట్ బిల్లు ఉన్నాయి. ఈ బిల్లులపై మంగళవారం చర్చించనున్నారు.
విద్యుత్తు బిల్లు-పర్యవసనాలపై చర్చ
కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్తు బిల్లు-పర్యవసనాలపై సభలో అర్థవంతమైన చర్చ జరిగింది. చర్చను టీఆర్ఎస్ సభ్యుడు, విప్ బాల్క సుమన్ ప్రారంభించగా, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల, కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, బీజేపీ సభ్యుడు రఘునందన్రావు మాట్లాడారు. విద్యుత్తు బిల్లులో మీటర్లు పెట్టాలని లేదని రఘునందన్రావు వ్యాఖ్యానించగా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సభ్యులంతా మండిపడ్డారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర విద్యుత్తు బిల్లు-పర్యవసనాలపై సుదీర్ఘంగా మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిని అంకెలతో సహా వివరిస్తూ ఎండగట్టారు. బీజేపీ తీరుపై సీఎం మాట్లాడుతున్నప్పుడు సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్తు బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు. భట్టి విక్రమార్క విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. మంగళవారం సభలో తీర్మానం చేద్దామని భరోసా ఇచ్చారు. చర్చ అనంతరం స్పీకర్ సభను మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.