వాజేడు, జూలై7 : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామనికి చెందిన మొడెం రామయ్యకు చంటి(36), శివాజీ కుమారులు ఉండగా, చంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మురుదొండ గ్రామానికి చెందిన యువతిని ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకొని అక్కడే అత్తగారింట్లో ఉంటున్నాడు.
ఈ క్రమంలో చంటి వచ్చి తండ్రి రామయ్యతో ఎకరం భూమి మొత్తం తనకే ఇవ్వాలని గొడవకు దిగి ఇంటి నుంచి బయటకు గెంటివేశాడు. భయంతో తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ్ముడు శివాజీ ఇంటికి వెళ్లి భూమి అంతా తనకే ఇవ్వాలని గొడవపడ్డాడు. అన్నను చంపితేనే సమస్యకు పరిష్కారం అనుకున్న శివాజీ కత్తితో చంటి కడుపులో పొడవడంతో మృతి చెందాడు.
విషయం తెలుసు కున్న మృతుడి భార్య సీమ ఇప్పగూడెం వచ్చి భర్త శవం చూసి బోరున విలపించింది. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్సై రేఖ అశోక్ చంటి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏటూరునాగారం వైద్యశాలకు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు శివాజీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.