లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మోదెల రోడ్డులో తన ప్రియురాలి కోసం ప్రియుడు చాతరాజు ప్రవీణ్.. తన తల్లి బానవ్వతో కలిసి శుక్రవారం బైఠాయించాడు. పట్టణానికి చెందిన యువతి, తనను ఐదేళ్లుగా ప్రేమిస్తున్నదని, ఆమె కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాము ప్రేమించుకుంటున్న విషయం మా ఇరు కుటుంబాలకు తెలుసని, ఒకరి ఇంటికి ఒకరం వెళ్లి గడిపిన ఫొటోలు కూడా ఉన్నాయని ప్రవీణ్ చూపించాడు.
తన ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని చూస్తున్నారని, రెండు రోజుల క్రితం ఈ విషయం ఆమె స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పిందని, ఆ వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయని తెలిపాడు. ప్రియురాలికి రూ. 5 లక్షల వరకు డబ్బులు కూడా ఇచ్చినట్లు వెల్లడించాడు. తనకు న్యాయం చేయాలని ఆమె ఇంటి సమీపంలోని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు కుటుంబాలను పోలీస్స్టేషన్కి పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.