Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): బహుళ అంతస్థుల భవన నిర్మాణాలతో ఆకాశమే హద్దుగా హైదరాబాద్ దూసుకుపోతున్నది తెలంగాణ ఏర్పడ్డాక అత్యాధునిక వసతులతో పెద్దఎత్తున హైరైజ్ భవనాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా కోకాపేట కేంద్రంగా 63 అంతస్థుల మరో ఆకాశహార్మ్యాన్ని నిర్మించేందుకు బిల్డర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి సన్నాహాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్టు తెలిసింది. డిజైన్లు, స్థలం కోసం ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. కాగా, ప్రస్తుతం పుప్పాల్గూడలో 59 అంతస్థులతో ‘క్యాండూర్ స్కైలైన్’ పేరుతో నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా కోకాపేటలో ‘సాస్క్రౌన్’ పేరుతో 58 అంతస్థులతో భారీ భవన నిర్మాణం చివరదశలో ఉన్నది.
దేశంలోని 7 ప్రధాన మెట్రో నగరాల్లో ఒకటైన హైదరాబాద్ వివిధ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. దేశ రాజధాని ఢిల్లీని వెనక్కి నెట్టి ఆర్థిక రాజధాని ముంబయి తర్వాత హైదరాబాద్లోనే అత్యంత ఎత్తయిన భవనాలు(హైరైజ్) ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ గతేడాదిలో ఒక ప్రకటనలో పేర్కొన్నది. హైరైజ్ భవనాల్లో ఆఫీసు కార్యకలాపాలే కాకుండా నివాసం ఉండేందుకు సైతం చాలామంది ఆసక్తి చూపుతుండడంతో బిల్డర్లు సైతం అద్భుతమైన ఆర్కిటెక్చర్ డిజైన్లతో భవనాల నిర్మాణానికి ముందుకు వస్తున్నారు.