Narayanpet | మక్తల్ టౌన్ : అప్పుడే పుట్టిన ఓ పసికందుకు ఆపద వచ్చింది. పసిపాప గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అప్రమత్తమైన 108 సిబ్బంది.. పసికందుకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం దాసర్దొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది.
దాసర్దొడ్డి గ్రామానికి చెందిన సీఆర్ హరితకు నెలలు నిండడంతో శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దవాఖానకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. 108 సిబ్బంది గ్రామానికి చేరుకునే సమయానికి హరిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత శిశువులో చలనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. వెంటనే వైద్య సిబ్బంది శిశువును పరీక్షించి గుండెకొట్టుకోవడం లేదని నిర్ధారించారు. 108 సిబ్బంది చంద్రశేఖర్, ఆనంద్ కలిసి పసిబాలుడికి అరగంట సేపు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. తల్లీబిడ్డలను మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్య సేవలు అందించారు. అంబులెన్స్ సిబ్బందిని పలువురు అభినందించారు.