Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగురోడ్డు కేంద్రంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మరో భారీ లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నది. రాజేంద్రనగర్ను అనుకొని ఉన్న బుద్వేల్ పరిధిలో ఒకేసారి దాదాపు 182 ఎకరాల్లో ఈ లేఅవుట్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ తరహాలో దీన్ని గ్రీన్ఫీల్డ్ గ్రోత్ సెంటర్గా అభివృద్ధి చేస్తున్నది. ఐటీ కారిడార్కు, అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్యలో ఔటర్ రింగురోడ్డును అనుకొని ఉన్న ఈ భారీ లేఅవుట్లో ప్లాట్లను ఎకరాల చొప్పున విక్రయించేందుకు హెచ్ఎండీఏ శుక్రవారం నోటిఫికేషన్ను జారీ చేసింది. సుమారు 100 ఎకరాలను 14 ప్లాట్లుగా చేసి ఈ నెల 10న ఆన్లైన్ వేలంలో విక్రయించేందుకు షెడ్యూలును ఖరారు చేసింది. ఈ లేఅవుట్కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కొనుగోలుదారులకు అందించేందుకు ఈ నెల 6న టీహబ్లో ప్రీ-బిడ్ మీటింగ్ను నిర్వహించనున్నట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ లేఅవుట్లో బహుళ అంతస్థుల భవనాల నిర్మాణాలు చేపట్టేందుకు 150, 120 అడుగుల విస్తీర్ణంతో కూడిన రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ నిబంధనలకు లోబడి ఐటీ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, దవాఖానలు, స్టార్ హోటళ్లు, హైరైజ్ నివాస భవనాలు వివిధ అవసరాలకోసం 44 అంతస్థుల వరకు నిర్మించేలా లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నారు.
హైదరాబాద్కు మణిహారం లాంటి ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న గ్రోత్ కారిడార్లో ఆకాశామే హద్దుగా పలు భవనాలు నిర్మితమవుతున్నాయి. ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి, నానక్రాంగూడ నుంచి ప్రారంభమైన అభివృద్ధి ఓఆర్ఆర్ వెంట శంషాబాద్ వైపు విస్తరిస్తుండడంతో ఆ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా గ్రోత్ కారిడార్లో నిర్ధేశించిన మాస్టర్ప్లాన్కు అనుగుణంగా ఈ లేఅవుట్లో దాదాపు రూ.200 కోట్లతో రోడ్లతోపాటు ఇతర మౌలికవసతులన్నీ కల్పించనున్నారు. 18 నెలల్లో ప్లాట్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి కొనుగోలుదారులకు అప్పగించనున్నారు.