పెబ్బేరు, ఏప్రిల్ 1 : వనపర్తి జిల్లా పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలో పౌరసరఫరాల శాఖ 1,280 లక్షల గన్నీ బస్తాలను నిల్వ ఉంచగా.. మొదట వాటికే నిప్పంటుకున్నది. ఈ ప్రమాదంలో బస్తాలన్నీ కాలి బూడిదయ్యాయి. వీటి విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా.
ప్రమాదం ఎలా సంభవించిందో నిర్ధారణ కానప్పటికీ.. మూడు ఫైర్ ఇంజన్లు, మున్సిపాలిటీ ట్యాంకర్లు గంటల కొద్దీ శ్రమించినా రాత్రి వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు. అలాగే కొంతమేర ధాన్యం కాలిపోయాయి. వీటి నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. గోదాం కూడా చాలా వరకు ధ్వంసం కాగా, దాని విలువపై కూడా స్పష్టత రాలేదు. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు జేసీబీలతో గోదాం గోడలను పగుల గొట్టాల్సి వచ్చింది. కొందరు ట్యాంకర్ల యజమానులు స్వచ్ఛందంగా నీటిని తెచ్చి ఫైర్ ఇంజన్లలో పోశారు.