హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఓ గురుకుల టీచర్ సమయస్ఫూర్తి 40 మంది విద్యార్థులను ప్రాణపాయం నుంచి కాపాడింది. వరద ప్రమాదాన్ని ముందే గ్రహించి, ముందు జాగ్రత్తగా ఆయన తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలతో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం తీవ్రంగా నష్టపోయింది. జంపన్న వాగు ఉప్పొంగడంతో కొండాయి గ్రామం పూర్తిగా నీట మునిగింది.
వరద తీవ్రతను ముందుగానే అంచనావేసిన స్థానిక గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పాయం మీనయ్య.. 40 మంది విద్యార్థులను తన ఇంటికి తీసుకెళ్లారు. విద్యార్థులందరికీ తన ఇంటి దగ్గరే వసతి కల్పించి, భోజనం పెట్టారు. మీనయ్య సమయస్ఫూర్తితో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్లు ఆదివారం ట్విట్టర్లో ఉపాధ్యాయుడిని అభినందించారు.