షాబాద్, సెప్టెంబర్ 28: తెలంగాణలో పల్లెప్రగతి పనులు ఎంతో బాగున్నాయని జమ్మూకశ్మీర్ ప్రజాప్రతినిధుల బృందం కితాబు ఇచ్చింది. బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్నగర్ గ్రామాన్ని జమ్మూకశ్మీర్కు చెందిన 43 మంది జిల్లా అభివృద్ధి కౌన్సిల్ చైర్మన్లు, బ్లాక్ అభివృద్ధి కౌన్సిల్ చైర్మన్లు పర్యటించారు. ముందుగా షాబాద్ మండల పరిషత్తు కార్యాలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, ఎంపీడీవో అనురాధతో కొద్దిసేపు ప్రభుత్వ పథకాలపై చర్చించారు.
తర్వాత సర్దార్నగర్లో పల్లెప్రకృతివనం, హరితహారం నర్సరీ, వైకుంఠధామం, కంపోస్ట్యార్డు, క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. ప్రభుత్వం పల్లెప్రగతి ద్వారా గ్రామాలను పరిశుభ్రం చేసేందుకు చర్యలు చేపట్డడం బాగుందని వారు పేర్కొన్నారు. పేదల కోసం కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరెంట్ తదితర పథకాలు బేషుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. ఇలాంటి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమ దగ్గర కూడా చేపడుతామని తెలిపారు. అనంతరం జమ్ముకశ్మీర్ మహిళా ప్రజాప్రతినిధులకు బతుకమ్మ చీరలు అందజేశారు.