మేడ్చల్, జనవరి 30: జీవితంలో అసాధ్యానికి తావులేదని, అందుకు తన జీవితమే ఓ ఉదాహరణ అని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోగల మల్లారెడ్డి విశ్వవిద్యాలయాన్ని ఆయన సందర్శించారు. వర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన సభలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అపజయాలకు ఎన్నడూ వెరవకూడదని సూచించారు. నిరంతరం శ్రమిస్తూ కష్టాలను అవలీలగా అధిగమించాలని చెప్పారు. కాళ్లు, చేతులు లేకుండా పుట్టిన తాను అధైర్యపడలేదని, జీవితంలో పట్టుదలతో అనుకున్నది సాధించగలిగానని తెలిపారు. తాను వక్తగా ఎదుగుతానని, పెండ్లి చేసుకొని నలుగురు పిల్లలకు తండ్రిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు.
ఏది కావాలన్నా సొంతంగా సాధించుకోవాలన్న దృక్పథాన్ని తన తల్లిదండ్రులు అలవాటు చేశారని, కాళ్లు, చేతులు లేవని బాధపడుతూ కూర్చోకుండా దేవుడు ఇచ్చిన మెదడును ఉపయోగించుకోవడం ఎలాగో నేర్పారని వెల్లడించారు. అందువల్లే తాను ఇలా మీ ముందు నిల్చున్నానని పేర్కొన్నారు. ఆరేండ్లలోనే సొంతంగా డబ్బులు సంపాదించుకోవాలని తన తల్లిదండ్రులు కండిషన్ పెట్టారని చెప్పారు. అయినా వెరవకుండా ఓ స్టోర్లో క్లీనింగ్ పనికి కుదిరానని, మెడతో వాక్యూమ్ క్లీనర్ను పట్టుకొని క్లీనింగ్ చేసి రెండు డాలర్లు సంపాదించేవాడినని చెప్పారు. ‘పరిస్థితుల నుంచి ఎప్పుడూ పారిపోకూడదు.. మీరు ఉత్తమంగా ఏంచేయగలరో అది చేయాలి. మీరు ఉన్నతంగా ఎదగాలంటే మీ వైఖరిని మార్చుకోవాలి. ఆటంకాలనే అవకాశాలుగా మల్చుకోవాలి.
ఏ పనిలోనూ ఒక్కసారే పరిపూర్ణత రాదు. నిత్యం శ్రమిస్తూ ఉంటేనే ఎందులోనైనా పరిపూర్ణత వస్తుంది. వైఫల్యాలనే తరగతి గదిగా మార్చుకోవాలి’ అని ఉద్బోధ చేశారు. ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది మనకు లభించదని, అదే జీవితమని పేర్కొన్నారు. ఏదైనా కష్టపడి సాధించాల్సిందేనని చెప్పారు. షూ పాలిష్ చేసే గిరిజన తెగకు చెందిన తన స్నేహితుడు హడ్సన్ ఓసారి రోడ్డుప్రమాదంలో గాయపడ్డాడని, డాక్టర్ల వల్ల బతికి బయటపడ్డాడని చెప్పారు. అదే సమయంలో అతడు వైద్యుడు కావాలని నిర్ణయించుకొన్నాడని తెలిపారు. ఇంగ్లిష్లో ప్రావీణ్యంలేని అతడు అంచెలంచెలుగా పెద్ద డాక్టర్గా ఎదిగాడని వివరించారు. ప్రస్తుతం అమెరికాలో 150 దవాఖానలను స్థాపించాడని తెలిపారు. ఎవరు కూడా ఎవరి కన్నా తక్కువ కాదని, ఎక్కువ కూడా కాదని పేర్కొన్నారు. విద్యార్థులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బిల్గేట్స్, స్టీవ్జాబ్స్లా ఎదిగితే సరిపోతుందని అనుకోవద్దని, అంతకు మించి సాధిస్తామని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
ఐటీ హబ్గా హైదరాబాద్
దేశంలో సాంకేతిక రాజధానిగా హైదరాబాద్ ఎదిగిందని నిక్ వుజిసిక్ ప్రశంసించారు. ఇక్కడికి ఎన్నో మేటి ఐటీ కంపెనీలు తరలివచ్చి, తమ కార్యకలాపాలు నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. హైదరాబాద్ ఐటీ హబ్గా ఎదుగుతున్నదని, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఈస్ట్గా రూపుదిద్దుకొంటున్నదని కితాబిచ్చారు. రాబోయే రోజుల్లో భా రతదేశం ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉందని నిక్ అభిప్రాయపడ్డారు. మంత్రి మల్లారెడ్డిని ‘ఫాదర ఆఫ్ ఎడ్యుకేషన్’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.
టేబుల్ పైనుంచి నిక్ ఉషారుగా ప్ర సంగిస్తూ..మధ్య మధ్యలో చలోక్తులు విసురుతూ..జీవిత సత్యాలను వివరిస్తూ చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం విద్యార్థులు, అధ్యాపకులను కట్టిపడేసింది. అంతకుముందు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడారు. నిక్ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం నిక్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో మల్లారెడ్డి వర్సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, కార్యదర్శి మహేందర్రెడ్డి, డైరెక్టర్ ప్రీతిరెడ్డి, ప్రవీణ్రెడ్డి, వైస్ చాన్స్లర్ వీఎస్కే రెడ్డి, నిత్య సంక్షేమ సంఘం సభ్యుడు బూరుగుపల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.