ఆసిఫాబాద్, మే 19: పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతున్న ఓ పదహారేండ్ల బాలుడు అంతలోనే గుండెపోటుతో పరలోకానికి చేరాడు. ఈ హృదయవిదారక ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బాబాపూర్లో చోటుచేసుకున్నది. బాబాపూర్కు చెందిన చునర్కార్ గుణవంత్రావు-లలిత దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు సచిన్(16) ఇటీవలే పదోతరగతి పాసయ్యాడు. సంతోషపడిన కుటుంబ సభ్యులు కళాశాలలో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం సచిన్ పుట్టిన రోజుకావడంతో గురువారం సాయంత్రం కొత్త దుస్తులు, కేక్ తీసుకొచ్చేందుకు ఆసిఫాబాద్ వెళ్లాడు. షాపింగ్ చేస్తున్న క్రమంలోనే ఛాతిలో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న దవాఖానకు వెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చారు.
పుట్టినరోజు వేడుకలకు కొన్ని గంటల ముందే సచిన్ గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అర్ధరాత్రి 12 గంటలకు శోకసంద్రంలోనే సచిన్ చేతితో కేక్కట్ చేయిస్తుండగా.. ఒక్కసారిగా తల్లిదండ్రులు, గ్రామస్థులు, బంధువులు భోరున విలపించారు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు.