హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తవ్వేకొద్ది కొత్త అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఏఈ ప్రశ్నపత్రాన్ని నిందితులు సినిమా బ్లాక్ టికెట్ల తరహాలో మార్కెట్లో అమ్మకానికి పెట్టినట్టు సిట్ విచారణలో బయటపడుతున్నది. తాము చెల్లించిన దానికంటే పెద్దమొత్తంలో సంపాదించేందుకు కోచింగ్ సెంటర్ల బయట ఉద్యోగార్థులతో నిందితులు బేరాలు పెట్టినట్టు తెలిసింది. కానీ, గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని మాత్రం తమ సర్కిళ్లలోనే గప్చుప్గా విక్రయించినట్టు సమాచారం. ఆ తరువాత జరిగే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను కూడా లీక్చేసి భారీమొత్తానికి విక్రయించేందుకు ప్లాన్ చేసినట్టు సిట్ గుర్తించింది. ఈ కేసులో సిట్ తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేసింది. మరో నలుగురు అనుమానితులను విచారిస్తున్నట్టు తెలిసింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 14 మంది అరెస్టయ్యా రు. మొదట్లో అరెస్టయిన తొమ్మిది మంది లో కీలకమైన నలుగురు ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి, ఢాక్యానాయక్, కేతవాత్ రాజేశ్వర్లను చంచల్గూడ జైలు నుంచి ఆదివారం సిట్ రెండోసారి కస్టడీలోకి తీసుకున్నది. వీరిని మూడు రోజులు విచారించనున్నది. తాజాగా సురేశ్, షమీమ్, రమేశ్లను కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిట్ కోరింది. ఈ ముగ్గురి కస్టడీపై రేపు కోర్టు నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి. ఏఈ పేపర్ లీకేజీలో కింగ్పిన్గా ఉన్న టీఎస్పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి ఆ ప్రశ్నపత్రాన్ని రేణుక ఆమె భర్త ఢాక్యాలకు అందించారు. దీనిని ఆమె సోదరుడు రాజేశ్వర్ పలువురికి లక్షలు తీసుకొని అమ్మినట్టు సిట్ విచారణలో తేలింది.
వికారాబాద్ జిల్లా డీఆర్డీఏలో రేణుక భర్త ఢాక్యానాయక్ పనిచేస్తుండటంతో ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారితో పరిచయాలున్నాయి. ఏఈ ప్రశ్నపత్రం తమ చేతిలోకి రావడంతో భారీగా డబ్బు సంపాదించుకోవాలని ఢాక్యా తన బామ్మర్ది రాజేశ్వర్తో కలిసి స్కెచ్ వేశాడు. ఉపాధి హామీ పథకంలో నవాబ్పేట్లో పనిచేసే ప్రశాంత్రెడ్డికి రూ.7.5 లక్షలకు ఏఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించాడు. విచారణలో ఈ విషయం తెలియడంతో శుక్రవారం ప్రశాంత్రెడ్డిని సిట్ అరెస్టు చేసింది. తిరుపతయ్య అనే కాంట్రాక్టర్ ద్వారా షాద్నగర్ నేరెళ్లచెరువు ప్రాంతానికి చెందిన రాజేంద్రకుమార్కు కూడా ప్రశ్నపత్రాన్ని అమ్మారు. ఈ క్రమంలో రాజేంద్రకుమార్కు తిరుపతయ్య అప్పు కూడా ఇచ్చినట్టు తెలిసింది. ప్రశ్నపత్రానికి రూ.10 లక్షలకు డీల్ కుదరగా, పరీక్షకు ముందు రూ.5 లక్షలు, ఫలితాలు వచ్చిన తరువాత రూ.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది.సిట్.. రాజేంద్రకుమార్ను అరెస్టు చేసింది. తిరుపతయ్యతోపాటు మరో ముగ్గురు అనుమానితులను సిట్ విచారిస్తున్నట్టు సమాచారం. ప్రశాంత్రెడ్డి, రాజేంద్రకుమార్కు ఏఈ పరీక్షకు రెండు రోజుల ముం దు ప్రశ్నపత్రం అందించగా.. హైదరాబాద్ కర్మన్ఘాట్లోని ఒక లాడ్జిలో వీరిద్దరిని కూర్చొబెట్టి చదివించినట్టు విచారణలో వెల్లడైంది.
గ్రూప్-1లో వంద మార్కులు వచ్చిన వారిని సిట్ విచారిస్తున్నది. ఆదివారం 20 మంది వరకు అభ్యర్థులను సిట్ అధికారులు ప్రశ్నించారు. 15 అంశాలతో కూడిన ప్రశ్నలతో విచారిస్తున్నారు. అభ్యర్థుల బయోడాటా, విద్యార్హతలు, ఏం చేస్తున్నారు? గతంలో ఏ పరీక్షలు రాశారు? ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు? అనే విషయాలు ఉన్నాయి.
మార్కెట్లోనే ఏఈ పేపర్ను విక్రయించేందుకు ఢాక్యానాయక్ జిల్లాలో ఎవరు పరీక్ష రాస్తున్నారనే విషయాన్ని గుర్తించి వారికి విక్రయించాడు. పేపర్ విక్రయించేందుకు ఢాక్యా ముఠా కొన్ని కోచింగ్ సెంటర్ల వద్ద కూడా తిరిగినట్టు పోలీసులు ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. తాజాగా అరెస్టయిన రాజేందర్ కూడా హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నట్టు తెలిసింది. కోచింగ్ సెంటర్లలో తమ తోటి వారికి రాజేందర్ ఏఈ పేపర్ను ఏమైనా విక్రయించాడా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లక్షల రూపాయలకు ప్రశ్నపత్రం బేరం పెట్టడంతో కొందరు అప్పులు తెచ్చి మరీ కొనుగోలు చేసినట్టు తెలిసింది.