హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేశాడు ఓ తండ్రి. తిరిగి కువైట్ వెళ్లి ఆ హత్య తానే చేశానని సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. అంతేకాకుండా పోలీసుల చేతకానితనంతోనే తాను హంతకుడిగా మారాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. అన్నమయ్య జిల్లా ఓబులావారిపల్లె మండలం మంగపేటలో నిద్రిస్తున్న 59ఏండ్ల వ్యక్తి రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు కువైట్ నుంచి ఓ సెల్ఫీ వీడియో వచ్చింది. ఈ హత్య చేసింది తానేనని .. హత్యకు గురైన ఆంజనేయులు బంధువు ఆంజనేయ ప్రసాద్ వీడియోలో తెలిపాడు.
తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకే హత్య చేసి కువైట్ వెళ్లిపోయానని పేర్కొన్నాడు. కాగా, పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు కువైట్ నుంచి ఆంజనేయప్రసాద్, ఆయన భార్య మంగళవారం ఇండియాకు వచ్చారు. రెండు రోజులు అవుతున్నా ఇంతవరకు ఆంజనేయప్రసాద్ దంపతుల ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని దంపతులిద్దరూ హెచ్చరించడంతో పోలీసు, బంధువుల్లో ఆందోళన నెలకొన్నది.