ఎల్కతుర్తి/హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రన్నింగ్లో ఉన్న ఆర్టీసీ బస్సు వెనుకటైర్లు ఊడిపోగా.. డ్రైవర్ చాకచక్యంతో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకున్నది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు సుమారు 80 మంది ప్రయాణికులతో హుజూరాబాద్ నుంచి హనుమకొండకు బయలుదేరింది. బస్సు వెనుక నుంచి శబ్దం వస్తుందని ప్రయాణికులు డ్రైవర్కు తెలిపారు.
డ్రైవర్ రాజు బస్సు ఆపి వెనుక టైర్లను పరిశీలించారు. అక్కడి నుంచి మెల్లగా బస్సును తీసుకెళ్తుండగా ఎల్కతుర్తి గ్రామ ప్రారంభ సరిహద్దులో వెనుక టైర్లు ఒక్కసారిగా ఊడిపోయి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో దూసుకుపోయాయి. టైర్లు లేకపోవడంతో రన్నింగ్లో ఉన్న బస్సు ఓవైపు ఒరిగింది. ఒక్కసారిగా బస్సు కుదిపేయడంతో వెనుక ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడగా స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేయడంతో బస్సు నిలిచిపోయింది. బస్సు వేగంగా ఉంటే తమ ప్రాణాలు గాల్లో కలిసేవని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిమితికి మించి ప్రయాణికులు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది. వీరంతా మరో బస్సులో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.
ఓవర్ లోడ్ కారణంగా బస్సు చక్రాలు ఊడినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారన్నది అబద్ధమని, ఆ సమయంలో సుమారు 42 మంది మాత్రమే ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. అద్దె బస్సుల నిర్వహణ విషయంలో వాటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షితమైన ప్రయాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకుండా పూర్థి సామర్థ్యంతో బస్సులను నడపాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు.