హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షా ఫ్యాక్షనిస్టుల ప్రభుత్వంలా తయారు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. మొన్నటి వరకు కులం, మతం పేరుతో సమాజాన్ని విభజించిన బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు తమ ప్రత్యర్థులను సీబీఐ, ఈడీ, ఐటీలతో వెంటాడుతున్నదని ధ్వజమెత్తారు. ఇది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు కూడా విరుద్ధమని చెప్పారు. బీజేపీ దుర్మార్గాలను ప్రతిఘటించేందుకు అందరం కలిసి గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్లోని మగ్దూంభవన్లో బుధవారం జరిగిన సీపీఐ నూతన రాష్ట్ర సమితి సమావేశంలో నారాయణ మాట్లాడుతూ.. అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశాల్లో భాగంగా అక్టోబర్ 16న ‘సేవ్ నేషన్’ పేరుతో నిర్వహించే జాతీయ సెమినార్కు తెలంగాణ, కేరళ, తమిళనాడు, బీహార్ ముఖ్యమంత్రులు కేసీఆర్, పినరాయి విజయన్, స్టాలిన్, నితీశ్కుమార్లను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య జాతీయ స్థాయిలో ఐక్యత బలపడేందుకు ఈ మహాసభల ద్వారా ప్రయత్నం జరగనున్నదని చెప్పారు.
ప్రజాసమస్యలపై ఎలాంటి మొహమాటం లేకుండా పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. తెలంగాణలో మతతత్వ బీజేపీని నిలువరించేందుకు మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామని, అదే సమయంలో ప్రజాసమస్యలపై రాజీ లేకుండా పోరాడుతామని అన్నారు. ప్రతిపక్షాల మధ్య ఐకత్య ఉంటే మోదీ మళ్లీ అధికారంలోకి రాలేడని మాజీ ఎంపీ అజీజ్ పాషా పేర్కొన్నారు.