రాజన్న సిరిసిల్ల : అనారోగ్యం, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడే బాధితులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. బాధితులనే లక్ష్యంగా చేసుకుంటూ మోసగిస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరస్థుణ్ని సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నూజివీడు నర్సంపేటకు చెందిన జలం పవన్ అనే ప్రైవేట్ ఉద్యోగి అమ్మ ట్రస్ట్ ను నిర్వహిస్తు మోసాలకు పాల్పడుతున్నాడు.
గత జులైలో నూకలమర్రికి చెందిన వేముల రాజశేఖర్ అనే బాధితుడు తన తల్లి చికిత్స కోసం ఆర్థిక సహాయం అందజేయాలని సామాజిక మాధ్యమంలో అభ్యర్థిస్తూ పోస్టు చేశాడు. గమనించిన జలం నవీన్ అమ్మట్రస్ట్ ద్వారా రూ. 4 లక్షలు సహాయం చేస్తానని నమ్మించి ముందుగా రూ. 14వేలు డిపాజిట్ చేయాలని కోరాడు. నమ్మిన బాధితుడు స్పందించి గూగుల్ పే ద్వారా రూ. 14వేలు పంపాడు. ఆ తరువాత బాధితుడి ఫోన్ నంబర్ను బ్లాక్లో పెట్టడంతో ఖంగుతిన్నాడు.
జరిగిన మోసాన్ని గ్రహించిన బాధితుడు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు లో భాగంగా నిందితుడి బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబర్ సీడీఆర్ విశ్లేషణ ద్వారా నూజివీడు లో ఉన్నాడనే సమాచారం మేరకు వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్, స్పెషల్ టీమ్ అక్కడికి వెళ్లారు. నిందితుడిని శుక్రవారం పట్టుకుని అతడి వద్ద ఉన్న నగదును, బ్యాంక్ పాస్పుస్తకాలను, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
సిరిసిల్ల, ఖమ్మం, అనంతపురం, సైబరాబాద్ జిల్లాలకు చెందిన బాధితులు ఈ నేరగాడి ఉచ్చులో చిక్కుకుని మోసపోయారని పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సైబర్ నేరానికి గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నంబర్1930, NCRP portal (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయాలని సూచించారు. డబ్బులు పోయాక బాధపడటం కంటే అవగాహనతో వ్యవహరించి ముందే జాగ్రత్త పడటం ఉత్తమమని సూచించారు.