మందమర్రి రూరల్ : అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న బీఆర్ఎస్ ( BRS ) కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్రావు ( CM KCR ) పాలన మహారాష్ట్ర ( Maharastra ) లోనూ రావాలని ఆకాంక్షిస్తూ మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజూరాకు చెందిన దంపతులు బాబురావు మస్కే, శోభ మస్కేలు హైదరాబాద్లోని ప్రగతి భవన్ వరకు పాదయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారి పాదయాత్ర మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండల పరిధిలోని అందుగులపేటకు చేరుకుంది. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా నల్లని దుస్తులు, బేడీలు ధరించి బ్యానర్ను పట్టుకొని పాదయాత్ర ( Padayatra ) ను నిర్వహిస్తున్నారు. బాబురావు మస్కే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ( Welfare ) దేశానికే స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు.
కేసీఆర్ పాలన బాగుందని బడుగు, బలహీనవర్గాలతో పాటు రైతులు, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా పాలన సాగుతోందని ప్రశంసించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరుస్తున్నారే తప్ప సామాన్య ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మోదీని ఎదుర్కొనే సత్తా కేవలం సీఎం కేసీఆర్కే ఉందని, తెలంగాణ, మహారాష్ట్రతో పాటు దేశంలో సీఎం కేసీఆర్ పాలన రావాలని ఆకాంక్షించారు.