ఎల్బీనగర్, అక్టోబర్ 19: టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న అవినీతి అధికారి, సిబ్బంది ఒకరు ఏసీబీ వలకు చిక్కారు. ఓ భవన నిర్మాణ అనుమతుల కోసం రూ.1.50 లక్షలు డిమాండ్ చేసి, నగదు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బాలాపూర్ మండలం గుర్రంగూడ గ్రామానికి చెందిన జక్కిడి సుధాకర్రెడ్డి బీఎన్రెడ్డినగర్ డివిజన్లో నూతన ఇంటి నిర్మాణ అనుమతుల కోసం టౌన్ప్లానింగ్ అధికారులను సంప్రదించారు.
దానికోసం రూ.1.50 లక్షలు లంచం ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు సుధాకర్రెడ్డి టౌన్ప్లానింగ్ సెక్షన్ రైటర్ లక్ష్మణ్యాదవ్కు నగదు ఇవ్వగా ఏసీబీ డీఏస్పీ మాజిద్ అలీ ఆధ్వర్యంలో దాడులు చేసి పట్టుకున్నారు. ఈ మేరకు టౌన్ప్లానింగ్ సూపర్వైజర్ ఉమాదేవి, లక్ష్మణ్యాదవ్ను అరెస్టు చేసి, ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.