బేగంపేట, డిసెంబర్ 22: ఆర్థిక లావాదేవీల విషయంలో ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ యువకుడిని కిడ్నాప్ చేసి, చితకబాదిన ఘటనలో నల్లగొండ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు పాత్ర ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటనపై బేగంపేట ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. రితిక్రెడ్డి కారును రసూల్పుర ఇందిరమ్మనగర్ నివాసి మహ్మద్ హైదర్(25) రితిక్కు తెలియకుండా రాజస్థాన్లో విక్రయించాడు. విషయం తెలుసుకున్న రితిక్రెడ్డి రాజస్థాన్కు వెళ్లి రూ.8 లక్షలు చెల్లించి కారును తెచ్చుకున్నాడు.
ఈ డబ్బుల విషయమై హైదర్తో రితిక్రెడ్డి మాట్లాడగా, రూ.4 లక్షలు చెల్లిస్తానని అగ్రిమెంట్ రాసిచ్చాడు. ఎంతకీ డబ్బులు ఇవ్వకపోవడంతో హైదర్ను బొల్లారం వీబీ సిటీలోని రితిక్రెడ్డి గదిలో బంధించారు. తనను కిడ్నాప్ చేశారంటూ తండ్రికి హైదర్ మెసేజ్ చేశాడు. అయన బేగంపేట పీఎస్లో ఫిర్యాదు చేయగా, విషయం తెలుసుకున్న రితిక్ స్నేహితులు హైదర్ను చితకబాదారు. రాత్రి 8 గంటలకు హైదర్ను బేగంపేట ఠాణా వద్ద వదిలివెళ్లారు. బాధితుడు తనను కిడ్నాప్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.