హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్)ను అరికట్టేందుకు ఆరు రాష్ర్టాలు సమిష్టిగా పోరాడనున్నాయి. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా ఉమ్మడి ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాయి. మహిళల అక్రమ రవాణా (విమెన్ ట్రాఫికింగ్)పై హైదరాబాద్లో శుక్ర, శనివారాల్లో జరిగిన జాతీయ సదస్సులో ఈ ఒప్పం దం కుదిరింది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరం మానవ అక్రమ రవాణాయేనని ఆవేదన వ్యక్తం చేశారు.
హ్యూమన్ ట్రాకింగ్ బాధితులను రక్షించడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం సంతోషదాయకమన్నారు. ఈ సమస్యను అరికట్టేందుకు వివిధ రాష్ర్టాలు సమిష్టిగా ముందుకు రావడం శుభపరిణామమన్నారు. హ్యూమన్ ట్రాకింగ్ నివారణకు రాష్ట్రాల మ ధ్య సహకారం ఎంతో ముఖ్యమని, ఇందుకోసం సంయుక్తంగా ఓ కౌన్సిల్ను ఏర్పాటు చేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. అక్రమ రవాణాకు గురవుతున్న వారిని రక్షించి పునరావాసం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతున్నదని తెలిపారు. పిల్లలు, మహిళల అక్రమ రవాణా, సైబర్ నేరాలను నిరోధించేందుకు ప్రభుత్వం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్, షీ-సైబర్ సెల్స్ను ఏర్పాటు చేసిందని చెప్పారు.
హ్యూమన్ ట్రాఫికింగ్పై ధృవ పోర్టల్ ఏర్పాటు
హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి సామాన్యులు సైతం తెలుసుకొనేందుకు వీలుగా ధృవ పోర్టల్ను, హ్యూమన్ ట్రాకింగ్ను అరికట్టేందుకు ప్రజ్వల ఎన్జీవోతో కలిసి తెలంగాణ పోలీస్ శాఖ ‘వికల్ప’ను నెలకొల్పిందని సునీత గుర్తుచేశారు. ట్రాఫికింగ్ బారినపడ్డ మహిళల కోసం రాష్ట్రం లో 4 అబ్జర్వేషన్ హోమ్స్, 2 స్పెషల్ హోమ్స్ పనిచేస్తున్నాయన్నారు. ఒడిశా నుంచి వలస వచ్చిన కూలీల పిల్లలతోపాటు ట్రాఫికింగ్ నుంచి బయటపడిన చిన్నారుల కోసం యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో పోలీస్, శిశు సంక్షేమ శాఖ లు సంయుక్తంగా ఒరియా పాఠశాలను ఏర్పాటు చేశాయని తెలిపారు.
ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ‘స్వరక్ష డే’
మానవ అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ఐసీడీస్ ప్రాజెక్టుల్లో ప్రతి నెల మూడో శనివారం ‘స్వరక్ష డే’ను నిర్వహిస్తున్నామని సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు 100, మహిళా హెల్ప్లైన్ 181, మహిళా కమిషన్ వాట్సప్ నంబర్ 94905 55533, 1098 చైల్డ్లైన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సదస్సులో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్ దివ్యా దేవరాజన్, ఐదు రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్పర్సన్లు, శిశు, సంక్షేమ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.