Petrol Bunk | హైదరాబాద్, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ): సివిల్ సైప్లె కార్పొరేషన్ పెట్రోల్ బంక్ల వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నది. అదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి సారించిన ఆ సంస్థ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలిదశలో తొమ్మిది జిల్లాల్లో బంక్ల ఏర్పాటుకు కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ ఆమోదం తెలిపారు. కరీంనగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో ఒకటి చొప్పున మేడ్చల్ జిల్లాలో రెండు పెట్రోల్ బంక్లను ఏర్పాటు చేయనున్నది. మిగతా జిల్లాల్లో త్వరలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందుకు సంబంధించి స్థలాల గుర్తింపుతో పాటు ఇతర చర్యల కోసం ఐదుగురు అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సైప్లె కార్పొరేషన్కు కమీషన్ రూపంలో కొంత మేర ఆదాయం సమకూరుతున్నది. కానీ దాంతోనే సంస్థను నడపలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయంపై అధికారులు దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థకు ఉన్న విలువైన భూములపై అక్రమార్కుల కన్నుపడింది. ఆ భూములను కాపాడుకోవడంతో పాటు అదనపు ఆదాయం వచ్చేలా ఆ స్థలాల్లో పెట్రోల్ బంక్లు ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది.
సంస్థలు లేదా ప్రైవేటు వ్యక్తులు కార్పొరేషన్ స్థలంలో పెట్రోల్ బంక్లు ఏర్పాటు చేసుకునేందుకు సంస్థ అనుమతి ఇస్తుంది. స్థలానికి ప్రతినెలా అక్కడి మార్కెట్ను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అద్దె వసూలు చేస్తారు. దీంతో పాటు జరిగిన వ్యాపారంలో కమీషన్ కూడా వస్తుంది. కేవలం అద్దె రూపంలోనే ప్రతినెలా కార్పొరేషన్కు సుమారు రూ.25-30 లక్షల వరకు ఆదాయం సమకూరనున్నది. ఇలా సంస్థ భూములను కాపాడుకోవడంతో పాటు అదనపు ఆదాయం పొందేలా ప్రణాళిక రూపొందించారు.
కార్పొరేషన్ ఆదా యం పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. ఇందుకోసం జిల్లాకో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్ర స్తుతం తొమ్మిది జిల్లాల్లో ఏర్పాటుకు అనుమతి ఇచ్చాం. ఇలా వచ్చే ఆదాయంతో మరిన్ని వ్యాపారాలను విస్తరిస్తాం.
– రవీందర్సింగ్, చైర్మన్, సివిల్ సైప్లె కార్పొరేషన్