వికారాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు ప్రత్యేకంగా బడ్జెట్లో ఏటా రూ.20 వేల కోట్లను కేటాయించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీ హక్కుల సాధనకు యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 23,973 మంది బీసీలు సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు అవుతారని ఆమె పేర్కొన్నారు.
బీసీల్లో ఎన్ని కులాలున్నాయనేది స్పష్టత లేదని,పులులు, పిట్టలు, నెమళ్లను లెక్కపెడుతున్నా, మనుషులను లెక్కపెట్టడం లేదని, తక్షణమే బీసీ కులగణన ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. మహాత్మాజ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని, ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పూలే విగ్రహం ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ఏప్రిల్ 11న జ్యోతిరావు పూలే 111వ జయంతి ఉన్నందున ఆలోగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు ఈనెల 12న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నామని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి బీసీ బిడ్డ తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు. 2018 నుంచి ఇప్పటివరకు యూ పీఎస్సీ పరీక్షలో 4,365 మంది పాసవగా, వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కేవలం 1,195 మంది మాత్ర మే ఎంపియ్యారని, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఉన్నా కేవలం 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారని తెలిపారు. ఎస్సీలు 5 శాతం, ఎస్టీ లు 3 శాతం మాత్రమే ఎంపికయ్యారని పేర్కొన్నా రు. వెనుకబడిన వర్గాల వారు కోల్పోతున్న రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడనందునే బీసీ మేధావులు ఈ అంశంపై గళమెత్తాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రూ.26 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.5 వేల కోట్లను మాత్రమే కేటాయించిందని ఆమె దుయ్యబట్టారు. ఈ సమావేశంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు, బీసీ నాయకులు బొల్ల శివకుమార్, దత్తాత్రేయ, తాడూరి శ్రీనివాస్, యునైటెడ్ పూలే ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్గౌడ్, జడ్పీ వైస్ చైర్మెన్ బీ విజయ్కుమార్తోపాటు 40 బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.