హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): భవిష్యత్లో వ్యవసాయరంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ అన్నారు. హైదరాబాద్ పటాన్చెరులో ఇక్రిశాట్, తెలంగాణ ఆగ్రోస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అగ్రి ఇన్పుట్స్ డీలర్ల శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. వానకాలం రాబోతున్న దృష్ట్యా భూసార పరీక్షలపై ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల నిర్వాహకులతో అవగాహన కల్పించేందుకు ఇక్రిశాట్ భాగస్వామ్యంతో శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
తాజాగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆగ్రోస్ ఇన్పుట్స్ డీలర్లకు రెండు రోజులపాటు శాస్త్రవేత్తలు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ ఆన్లైన్లో హాజరై శిక్షణ పొందిన ఆగ్రోస్ సేవా కేంద్రాల నిర్వాహకులైన డీలర్లతో మాట్లాడారు. అనంతరం శిక్షణ పొందిన డీలర్లకు డీజీ పాఠక్, ఆగ్రోస్ ఎండీ రాములు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు.
అనంతరం డిజిటల్ టెక్నాలజీ సాయంతో సహజ వ్యవసాయం ద్వారా నీరు పొదుపుగా వాడి నాణ్యమైన ఆహారోత్పత్తులు పొందాలని డీజీ పిలుపునిచ్చారు. పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడకుండా సహజ, ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించాలని టీజీ ఆగ్రోస్ సంస్థ ఎండీ కె.రాములు సూచించారు.