మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 7: ఎప్పుడో 11 ఏండ్ల క్రితం తప్పిపోయిన ఒక బాలుడు ఇన్నాళ్లకు తల్లిదండ్రుల వద్దకు చేరాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలం చిలుకాగనగర్కు చెందిన నారాయణశర్మ కొడుకు రోహిత్శర్మ 2013లో రైలు ప్రయాణంలో తప్పిపోయాడు. అప్పటికి ఆ బాలుడి వయసు ఐదేండ్లు. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ఆ చిన్నారి రైల్లో ప్రయాణిస్తూ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్కు చేరుకున్నాడు. తప్పిపోయిన బాలుడిగా గుర్తించిన అక్కడి అధృత చిల్డ్రన్హోం నిర్వాహకులు ఆశ్రయం కల్పించారు.అప్పటి నుంచి ఆ బాలుడి తల్లిదండ్రుల ఆచూకీ కొనుగొనేందుకు చిల్డ్రన్హోం నిర్వాహకులు అనేక ప్రయత్నాలు చేశారు.
చివరకు హైదరాబాద్లోని ఉప్పల్కు చెందినవాడిగా గుర్తించి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలల సంక్షేమ సమితికి సమాచారం అందజేశారు. దీంతో సమితి నిర్వాహకులు పోలీసుల సహకారంతో బాలుడి తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకున్నారు. దీంతో అధృత చిల్డ్రన్హోం నిర్వాహకులు ఒడిశాలోని కోధ్ర అడిషనల్ చైల్డ్ వేల్ఫేర్ కమిటీ ద్వారా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలల సంక్షేమ సంఘానికి ఆ బాలుడిని అప్పగించారు. బుధవారం కమిటీ చైర్పర్సన్ రాజారెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్లోని బాలరక్ష భవన్లో రోహితశర్మను తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన బాలుడు తమ ఒడికి చేరడంతో ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఆనందభాష్పాలతో అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో చైల్డ్వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు అర్చన, నాగజయశీల, నాగజయశ్రీ, రామ్మోహన్, బాలరక్ష భవన్ కో ఆర్డినేటర్ నాగమణి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఇంతియాజ్ రహిం తదితరులు పాల్గొన్నారు.