Marriage | మంచిర్యాల : ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కూడా సాధించాడు. ఇక తన ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులను ఒప్పించాడు. ప్రియురాలి కుటుంబ సభ్యులు కూడా వారి వివాహానికి అంగీకరించడంతో ఆ ప్రేమికులిద్దరూ ఆనందంలో మునిగిపోయారు. తమ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేసుకోవాలనుకున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. మరో ఐదు రోజుల్లో పంచభూతాల సాక్షిగా ఒక్కటి కాబోయే ఆ జంటను మృత్యువు విడదీసింది. పెళ్లి నేపథ్యంలో ఉద్యోగానికి సెలవు పెట్టి సొంతూరికి బయల్దేరిన ప్రేమికుడిని హార్వెస్టర్ బలి తీసుకుంది. ఈ హృదయ విదారక ఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కొత్త కొమ్ముగూడం గ్రామానికి చెందిన ఓగేటి సత్తయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు సాయికుమార్(24) నిర్మల్ విద్యుత్శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. నాలుగేండ్ల నుంచి తమ బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ నెల 11న వారి పెండ్లి జరిపించాలని ఇరు కుటుంబాలు నిశ్చయించాయి. లగ్గం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక పెళ్లికి వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో సాయి కుమార్ తన ఉద్యోగానికి సెలవు పెట్టాడు.
తన స్నేహితుడు మహేశ్తో కలిసి ఈ నెల 4వ తేదీన నిర్మల్కు బైక్పై బయల్దేరాడు సాయికుమార్. అదే రోజు రాత్రి సొంతూరుకు తిరిగి వస్తుండగా, మేదరిపేట వద్ద లక్సెట్టిపేట వైపు వెళ్తున్న హార్వేస్టర్ ముందు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి సాయి ప్రయాణిస్తున్న బైక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సాయి అక్కడికక్కడే మృతి చెందినట్లు దండేపల్లి ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. మహేశ్కు తీవ్ర గాయాలు కాగా, కరీంనగర్ దవాఖానకు తరలించారు. సాయి మృతదేహాన్ని లక్సెట్టిపేట దవాఖానకు తరలించారు. చేతికొచ్చిన కుమారుడు చనిపోవడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లి చేసుకొని సంతోషంగా జీవిస్తామనుకున్న ఆ యువతి తన ప్రియుడు లేడని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్నది.