రంగారెడ్డి : హైదరాబాద్ నగర శివారులో ఉన్న హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. దీంతో ఆ ప్రాజెక్టు ఆరు గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఈసీ వాగు ఉప్పొంగింది. దర్గా వంతెన వద్ద ఈసీ వాగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ.. సర్వీస్ రోడ్డుపై ఓ వాహనదారుడు తన బైక్ను ముందుకు పోనిచ్చాడు. సర్వీస్ రోడ్డు మధ్యలోనే ఆ యువకుడు ఆగిపోయాడు.
అయితే ఆ రహదారికి ఇరువైపులా ఇనుప గ్రిల్స్ ఉండటంతో ఆ వాహనదారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. బైక్ ఆ గ్రిల్స్కు అనుకోవడంతో అది కిందకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. అతను కూడా గ్రిల్స్ ను ఆసరాగా చేసుకొని అక్కడే ఉండిపోయాడు. ఒక వేళ ఇనుప గ్రిల్స్ లేకపోయి ఉంటే అతను కొట్టుకుపోయేవాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితుడిని ప్రాణాలతో కాపాడారు. బైక్ను ట్రాఫిక్ వాహనానికి కట్టి వరద నుంచి బయటకు లాగారు. బాధిత యువకుడిని వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం దుప్చెర్ల గ్రామానికి చెందిన గౌని అరవింద్ గౌడ్గా పోలీసులు గుర్తించారు.
హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో ఈసీ వాగు ఉప్పొంగింది.. ఆ వరద ఉధృతిలో చిక్కుకున్న వాహనదారుడిని రక్షించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు.. pic.twitter.com/c8LSDk622Y
— Namasthe Telangana (@ntdailyonline) July 26, 2022