ఎదులాపురం/ముంబై, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పొగమంచు ఇద్దరు మెడికోలను బలితీసుకున్నది. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పాండ్రకోడ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వరంగల్కు చెందిన కొగిల డేవిడ్రాజు(22), ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన చిప్పల బాలసాయి(23)తో పాటు యశ్వంత్రెడ్డి, అమృతరాజ్, సాయికిరణ్, చరణ్దీప్ ఆదివారం సాయంత్రం రిమ్స్ నుంచి మూడు బైక్లపై పాండ్రకౌడలో ఉన్న దాబాలో భోజనం చేయడానికి వెళ్లారు.
విందు అనంతరం తిరిగి ఆదిలాబాద్కు వస్తుండగా, పాండ్రకౌడ టోల్ప్లాజ్ వద్ద ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. మంచు అధికంగా ఉండటంతో ఆగి ఉన్న లారీ కనబడక ఢీకొట్టినట్టు తెలుస్తున్నది. బైక్ నడుపుతున్న బాలసాయి అక్కడిక్కడే మృతి చెందగా, డేవిడ్రాజ్ను రిమ్స్కు తరలించగా, అప్పటికే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే సోమవారం ఉదయం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ అశోక్, వైద్యులు ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాల వద్ద వైద్యవిద్యార్థులు, ప్రొఫెసర్లు, వైద్యసిబ్బంది, మిత్రులు నివాళులర్పించారు. ప్రత్యేక వాహనంలో స్వస్థలాలకు తరలించారు.